తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
బీజేపీ - బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయి
అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను సైతం మోడీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారు.
ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు... ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా?
రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు... ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇది బీజేపీ - బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్.
కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి...
వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి?!
కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుండి అందుతున్నాయి?
గడచిన పదేళ్లలో మోడీ - షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కు మన్నది లేదు.
కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.
కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్ది... ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయి.
అమిత్ షా - కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం...
పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం... ఇదే కదా జరుగుతున్నది.
ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే... వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోంది.
కేసీఆర్ కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవు.
కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్ ను ప్రశ్నించవు.
కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై...
తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారు.
మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు... కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా?!
పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై కూడా ఉంది.
నేను బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నా.
మీ పతనం మొదలైంది. మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది.
మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయి.
వివేక్ వెంకట స్వామి కుటుంబం పై దాడి కాంగ్రెస్ పార్టీ పై జరిగిన దాడిగా భావిస్తాం.
వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది.
ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరు.
